రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం 72 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది బీజేపీ. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తాజా లిస్టులో 6 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. మొత్తంగా తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.
మహబూబ్నగర్ ఎంపీ సీటు విషయంలో డి.కె.అరుణ, జితేందర్ రెడ్డి మధ్య కొనసాగిన వార్కు తెరదించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి.కె.అరుణకు పాలమూరు ఎంపీ టికెట్ ఫైనల్ చేసింది బీజేపీ. ఇక మెదక్ నుంచి మరోసారి రఘునందన్రావుకు అవకాశమిచ్చింది.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురిలో ముగ్గురిని తాజా జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించింది. నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్ అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసిన బీజేపీ.. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని గొడెం నగేష్ను అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి టికెట్ కేటాయించింది. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పార్టీలో చేరినప్పటికీ పెండింగ్లో ఉంచడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ తాజా లిస్టు ఇదే..
మహబూబ్నగర్ – డి.కె.అరుణ
ఆదిలాబాద్ – గొడెం నగేష్
మహబూబాబాద్ – సీతారాంనాయక్
పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్
నల్గొండ – శానంపూడి సైదిరెడ్డి
మెదక్ – రఘునందన్
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషితో పాటు సోమవారం హర్యానా సీఎంగా రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్లకు తాజా జాబితాలో చోటు దక్కింది. నితిన్ గడ్కరీ మరోసారి నాగ్పూర్ నుంచి పోటీ చేయనుండగా, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, కర్నాల్ స్థానం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో దిగనున్నారు.