తిరుమల లడ్డూ నాణ్యత వివాదం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. తప్పు మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలో జరిగిందంటూ టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇక్కడే వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. కార్యాలయం పైకి కాషాయం రంగు ప్యాకెట్లు విసిరారు బీజేవైఎం కార్యకర్తలు. కాషాయ జెండాలు పట్టుకుని వాహనాల్లో వచ్చి హడావిడి చేశారు.
బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో వైసీపీ కేంద్ర కార్యాలయం సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోపే బీజేవైఎం కార్యకర్తలు కార్యాలయం వద్ద ఉన్న పోలీసు ఔట్ పోస్టు అద్దాలను ధ్వంసం చేశారు. గేట్లు ఎక్కి లోపలకు దూకేందుకు యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మెయిన్ గేట్ వద్ద కూర్చుని ఆందోళన చేపట్టారు. జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం గేట్లు, గోడలపై కాషాయం రంగు ప్యాకెట్లు విసిరేశారు.
వైసీపీ ఫ్లెక్సీలను చించి తగలబెట్టారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కట్టడి చేశారు. అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ తాడేపల్లి పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.