టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అప్పుడే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరిచిపోయినట్లున్నారు. మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార సభల్లో తాను ఇచ్చిన హామీల గురించి ఆయన చెప్పడం లేదు. తాను అధికారంలోకి వస్తే చేసే హామీల గురించి అసలు వివరించడం లేదు. తాను ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మరనే విషయం ఆయనకు అర్థమైనట్లు ఉంది.
సూపర్ సిక్స్ అంటూ మొదట్లో ప్రకటించిన ఆయన దాన్ని చాలా రోజుల దాకా మళ్లీ ప్రస్తావించలేదు. ఇటీవల ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. అదీ తన మిత్రడు పవన్ కల్యాణ్తో కలిసి విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. దీంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయపడింది.
అయినప్పటికీ తాను అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించకుండా ఆయన దొడ్డి దారిని ఎంచుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బూచిని చూపించి ప్రజలను భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతి చోటా దాని గురించే మాట్లాడుతున్నారు. అది ఇప్పటి వరకు అమలులోకి రాలేదని చెప్పినా ఆయన చెవికెక్కడం లేదు.
చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తే 1.60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఒక అంచనా. ఇంత మొత్తాన్ని ఆయన ఎలా సమీకరిస్తారనేది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పే మాటలు నీటి మీది రాతలనే విషయం ప్రజలకు అర్థమైంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేస్తానంటే ప్రజలు నమ్ముతారా, అంటే లేదనే సమాధానమే వస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు మేనిఫెస్టోను చూసి ఏమీ బెదిరిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయబోడని, మోసం చేస్తాడని జగన్ ప్రజలకు చెబుతూ వస్తున్నారు. తాను మాత్రం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని చెప్పుతున్నారు. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటేయాలని, చంద్రదబాబు వస్తే వాటికి ముగింపు పలుకుతాడని చెప్పుతున్నారు.