వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కాదంటే, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలిచి కొంత మంది నాయకులకు టికెట్లు ఇచ్చారు. జగన్ టికెట్లు నిరాకరించడం వల్ల అలిగిన నేతలను చంద్రబాబు చేరదీసీ టికెట్లు ఇచ్చారు. నమ్మకున్న టీడీపీ నేతలను ఆయన నట్టేట ముంచారు. అటువంటి నేతల్లో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఒక్కరు. వైసీపీలో ఉన్నంత కాలం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్.. గుమ్మనూరు జయరాంను అనని మాటలు లేవు. ఆయనను రౌడీ మంత్రిగా, బెంజ్ కారు మంత్రిగా అభివర్ణించారు. జూదం ఆడించేవాడని, అవినీతిపరుడని, భూకబ్జాదారు అని తిట్టిపోశారు. నారా లోకేష్ తన ఎర్రబుక్కులో జయరాం పేరును కూడా ఎక్కించారు. దానికి ఎల్లో మీడియా వంత పాడింది. జయరాం అక్రమాలపై వార్తాకథనాలు రాసింది. జయరాంను సంఘ వ్యతిరేకశక్తిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చిత్రీకరించాయి.
జయరాంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ టికెట్ నిరాకరించారు. దాంతో ఆయన అలిగి కొంత కాలం ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. జయరాంకు చంద్రబాబు గుంతకల్ టికెట్ ఇచ్చారు. టీడీపీలో చేరిపోగానే జయరాం నీతిమంతుడయ్యాడు. ఆయనపై రామోజీరావు, రాధాకృష్ణ వార్తాకథనాలు రాయడం మానేశారు. టీడీపీలో చేరగానే ఆయనపై చేసిన ఆరోపణలను అన్నింటినీ వారు మాఫీ చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా ఆయనను అక్కున చేర్చుకుని కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తమ వెంట ఉంటే ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నవాడైనా ఇట్లే నీతిమంతుడు అవుతాడు.
పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయం కూడా అంతే. ఢిల్లీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ ఆ కేసులో అరెస్టయి అప్రూవర్గా మారారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. వైసీపీలో ఉన్నంత కాలం ఆయనను ఎల్లో మీడియా వెంటాడింది. జగన్ మీద కూడా నిందలు వేసింది. శ్రీనివాసులు రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. దాంతో ఆయన, ఆయన కుమారుడు పచ్చకండువా కప్పేసుకున్నారు.
టీడీపీలో చేరగానే ఆయన నీతిమంతుడయ్యాడు. చంద్రబాబు ద్వంద్వ నీతిని అనుసరిస్తూ వస్తున్నారు. తన వైపు ఉన్నవాళ్లంతా సొక్కం, వైసీపీలో ఉన్నవారు అవినీతిపరులు అని ఆయన తెగ వాగేస్తూ ఉంటారు. అవినీతిపరులను చేరువ చేసుకుని వారి డబ్బుతో ఎన్నికల్లో విజయం సాధిద్దామని బహుశా చంద్రబాబు అనుకుంటూ ఉండవచ్చు. కానీ అది చెల్లదు.