తమ్ముళ్ళతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. బీజేపీ, జనసేనతో పెట్టుకున్న పొత్తును సమర్ధించుకునేందుకు నానా పాట్లుపడ్డారు. మొత్తం మీద చంద్రబాబు తమ్ముళ్ళతో చెప్పింది ఏమిటంటే పోలవరం పూర్తి చేయటానికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు సాధించటం, ఉద్యోగాల కల్పన, మౌళిక సదుపాయాల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వ సాయం చాలా అవసరమట. అందుకనే ఎన్డీయేలో చేరినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇక్కడే చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలిసిపోయింది.
చంద్రబాబు చెప్పిందంతా నిజమే అయితే మరి 2018లో ఎన్డీయేలో నుండి బయటకు ఎందుకు వచ్చేశారో చెప్పగలరా? బయటకు వచ్చేసిన తర్వాత ఏమన్నారు? రాష్ట్రాభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నట్లు గోలగోల చేశారు. కేంద్రంపై ధర్మపోరాటమన్నారు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. 2014-19 లో రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబుడులు కూడా పెద్దగా లేవు కాబట్టి కల్పించిన ఉద్యోగాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి.
చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలో చేరింది అచ్చంగా తన రాజకీయ అవసరాల కోసమే అని తమ్ముళ్ళతో పాటు అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు కొడుకు, పార్టీకి కూడా కష్టాలు తప్పవు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేరన్నది వాస్తవం. జగన్ నుండి రక్షణ కోసమే చంద్రబాబు బీజేపీని బతిమలాడుకుని ఎన్డీయేలో చేరారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతోటిదానికి పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన అంటూ కథలు వినిపించారు. నిజానికి బీజేపీతో పొత్తు విషయాన్ని తమ్ముళ్ళతో చెప్పి సమర్ధించుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే చంద్రబాబు ఎంతచెప్పినా బీజేపీతో పొత్తును తమ్ముళ్ళలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం తెలిసినా ప్రత్యేకంగా ప్రస్తావించారంటేనే చంద్రబాబు పరిస్థితి ఏమిటో అర్థమైపోతోంది. పైగా రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు పార్టీలకు, వ్యక్తులకు ఉంటాయే కాని రాష్ట్రానికి ఉండదు. ఇదేమన్నా ఆటల పోటీలా పలానా రాష్ట్రం గెలిచింది, పలానా రాష్ట్రం ఓడిందని చెప్పటానికి. రేపటి ఎన్నికల్లో మళ్ళీ జగనే గెలిస్తే రాష్ట్రం ఓడిపోయిందని చెబుతారేమో చూడాలి.