టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యంతో ముంచెత్తారు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి హామీలను తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తూ వస్తున్నారు. ప్రభుత్వం విధించిన ఏఆర్టీఈ పన్నుతో ప్రభుత్వ రాబడి పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచినందు వల్ల ప్రభుత్వానికి పెరిగిన ఆదాయం ఏమీ లేదు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లు విచ్చలవిడిగా వ్యవహరించాయి. మూడు పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాపులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతూ వచ్చాయి. అనధికారికంగా 24 గంటలు మద్యం విక్రయాలు జరుగుతుండేవి.
రాష్ట్రంలోని 4,380 మద్యం దుకాణాలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా 43 వేలకు పైగా బెల్ట్ షాపులు పనిచేశాయి. ఎమ్మార్పీ ధరల కన్నా 25 శాతం అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రతి యేటా మద్యం దుకాణాల సంఖ్యను పెంచుతూ వచ్చారు. మద్యం నాణ్యత పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తూ వచ్చారు. చంద్రబాబు హయాంలోని ఐదేళ్లలో కేవలం 96,614 శాంపిల్స్ ను మాత్రమే సేకరించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో 34.9 శాతం మంది పురుషులు, 0.4 శాతం మంది మహిళలకు మద్యం సేవించే అలవాటు ఉంది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మాఫియా అరాచకాలకు కళ్లెం వేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. 2019 అక్టోబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వపరం చేశారు. మద్యం దుకాణాల వేళలను కుదించారు. రాత్రి 10 గంటల వరకే వాటిని తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని 4,380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశారు. 43 వేల బెల్ట్ షాపులను మూసివేశారు. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం కేవలం 2,934 దుకాణాలు మాత్రమే ఉన్నాయి.
కొత్త బార్లకు లైసెన్స్ లు ఇవ్వలేదు. మద్యం నాణ్యతా పరీక్షల కోసం బేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీలు ఏర్పాటు చేశారు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. దీంతో 2019-21 నాటికి పురుషుల్లో 31.2 శాతానికి, మహిళల్లో 0.2 శాతానికి మద్యం సేవించేవారి సంఖ్య తగ్గింది.