పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనర్, డీఈఈ బాహాబాహీకి దిగారు. కౌన్సిల్లో సభ్యులందరి సాక్షిగా ఇద్దరూ కొట్టుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ ఒక్కసారిగా భగ్గుమనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
తొలుత కౌన్సిల్ ప్రారంభం కాగానే అజెండాలోని పలు పనులపై చర్చించారు. ఆ పనులు ఎవరి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యో గుల జీతాలు చెల్లింపులు ఎవరు చూస్తున్నారంటూ ఓ కౌన్సిలర్ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఇక్కడ పనిచేస్తున్న డీఈఈ భవానీశంకర్ ఎన్నికల ముందు చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లిపోయారని, దాంతో ఆయన్ని సరెండర్ చేశానన్నారు. అయితే, కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుని ఆయన తిరిగి విధుల్లో చేరారన్నారు. కానీ, ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఈఈతో సంతకాలు పెట్టించుకుని పనులు పూర్తిచేస్తున్నామని కమిషనర్ ఆరోపణలు చేశారు. అసలాయన ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న డీఈఈ భవానీశంకర్ ఒక్కసారిగా ఎదురుతిరిగారు. కమిషనర్ అక్రమాలకు తాను సహకరించడం లేదని, ఇలా అబద్ధాలు చెబుతున్నారంటూ విరుచుకుపడ్డారు. కనకారావు వచ్చినప్పటి నుంచి పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటికి తాను సహకరించకపోవడంతోనే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఒక్కసారిగా భౌతిక దాడులకు దిగారు. ఈ ఘటన సమావేశంలో సభ్యులను విస్తుపోయేలా చేసింది. కౌన్సిల్ సభ్యులు, మీడియా ప్రతినిధులు వెంటనే అప్రమత్తమై వారిని విడదీసి శాంతింపజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
డీఈఈపై వేటు..
ఈ ఘటనలో డీఈఈ భవానీ శంకర్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల ఘర్షణకు సంబంధించి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిశోర్, మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు విచారణ నిర్వహించి కమిషనర్, డీఈఈలతో పాటు కార్యాలయ సిబ్బంది నుంచి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. అనంతరం వారి నివేదిక మేరకు డీఈఈ భవానీశంకర్ను సస్పెండ్ చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్కి జిల్లా కలెక్టర్ సూచించడంతో శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.