తెలంగాణలో హైడ్రా వ్యవస్థ సంచలనంగా మారింది. హైదరాబాద్ రియల్టర్లకు ఇప్పుడు హైడ్రా గుబులు పుట్టిస్తోంది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా.. FTL, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తూ హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు, ఇంటి కొనుగోళ్లు, అమ్మకాలు పడిపోయాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి.. ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోయింది.
ఐతే తాజాగా రేవంత్ సర్కార్ హైడ్రా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే భవనాలకు హైడ్రా పర్మిషన్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇళ్ల కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్(NOC) ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనల్లో మార్పులు చేస్తారని సమాచారం. అక్రమంగా నిర్మించిన భవనాలకు ఇంటి నెంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు హైడ్రాను బలోపేతం చేస్తోంది. తాజాగా హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. 15 మంది సీఐ స్థాయి, 8 మంది SI స్థాయి అధికారులను హైడ్రాకు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్పై అధికారులను కేటాయిస్తూ డీజీపీ ఆఫీసు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఆక్రమణలను పరిశీలిస్తూ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా సిబ్బంది కేటాయింపుతో కూల్చివేతలు మరింత వేగవంతం కానున్నాయి.