గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. FTL, బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయబోమని చెప్పారు. ఈ మేరకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. FTL పరిధిలో కొత్తగా నిర్మించే వాటిని మాత్రమే కూల్చుతామని స్పష్టం చేశారు. తాజాగా మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్లోని మల్లంపేట్ చెరువులో కూల్చిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవన్నారు రంగనాథ్.
అమీన్పూర్ చెరువులో కూల్చివేతలపైనా క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. ఈ నిర్మాణాలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవని చెప్పారు. కాంపౌండ్ వాల్, గోడలు, షెడ్లు ఆక్రమించి నిర్మించారని చెప్పారు. సున్నం చెరువులో నిర్మించిన హోటల్ FTL పరిధిలోకి వస్తుందని.. దాన్ని కూడా కూల్చివేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయన్నారు.
ప్రజలకు కీలక సూచనలు చేశారు రంగనాథ్. FTL, బఫర్ జోన్ పరిధిలో ఉండే ఇల్లు, ఫ్లాట్, భూములను కొనుగోలు చేయొద్దని సూచించారు. కొనుగోలు సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే HMDA లేక్స్ వెబ్సైట్ను సందర్శించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు.