ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కొత్త పథకాలు ప్రవేశ పెట్టలేదని, ఉన్నవాటిని ఎత్తేశారని.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఊసే లేదని ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారని ఆరోపించారు. అందుకే తిరుమల లడ్డూలపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్నారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ.. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే నైజం బాబుది అని మండిపడ్డారు జగన్.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారన్నారు జగన్. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? అని ప్రశ్నించారు. దశాబ్ధాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు జరుగుతోందని, ప్రతి ట్యాంకర్ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాల్సి ఉంటుందని, ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్ను తీసుకుని టెస్ట్ చేస్తుందని, ఈ టెస్ట్లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుందని వివరించారు జగన్. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతోందని చెప్పారాయన. 2014-19 మధ్య కాలంలో నెయ్యిని 14 నుంచి 15 సార్లు రిజక్ట్ చేశారని, వైసీపీ హయాంలో 18 సార్లు రిజక్ట్ చేశామన్నారు. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని మండిపడ్డారు జగన్.
ఇక సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రిపోర్ట్ ల పై కూడా జగన్ స్పందించారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని, వాటి ఫలితాలు జులై 23న వచ్చాయని.. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు జగన్. 2 నెలలు క్రితం రిపోర్ట్ లు వస్తే ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నాని, ఈ విషయంపై ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖలు రాస్తామన్నారు జగన్. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అబద్ధాల చంద్రబాబుకు అక్షింతలు వేయాలన్నారు.