సీఎం చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలని.. ఏపీకి మెడికల్ సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, కాలేజీల్లోని మిగిలిన పనులు పూర్తిచేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం చేతనైనంత ఖర్చుయాలని, వారికి చేతకాకపోతే వచ్చే ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని అప్పుడు ఆ పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇలాంటి స్కామ్లు చేయడం మానుకోకపోతే చంద్రబాబు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు జగన్.
https://x.com/ysjagan/status/1835250694053400715
రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు లేఖ రాయడం దారుణం అన్నారు జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏంటని నిలదీశారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు జగన్. ఈ బాధ్యతల నుంచి కూటమి ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుందన్నారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించిందని చెప్పారు జగన్. 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయని, 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఇదే విధానంలో ముందుకెళ్తే ఈ ఏడాదిలో మరో 5 కాలేజీలు, వాటిల్లో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవన్నారు జగన్. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేశారని, పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మండిపడ్డారాయన. కొవిడ్ సంక్షోభం ఉన్నా తమ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు జగన్. ఈ ఖర్చంతా భారం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తోందని, ప్రైవేటుపై వారికి అంత మోజెందుకని నిలదీశారు.
అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ సీట్లన్నీ ఫ్రీ అన్న కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఏరుదాటాక తెప్పతగలేయడం అంటే ఇదేనన్నారు. కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులతోపాటు, అక్కడి ప్రజలు కూడా నష్టపోతారని, వారికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదని చెప్పారు. ఇకనైనా చంద్రబాబు తప్పు తెలుసుకుని మెడికల్ సీట్ల విషయంలే ఎన్ఎంసీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్.