పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య ఖరారైంది. జనసేన రాష్ట్రంలో 24 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోక్సభ స్థానాలకు పోటీ చేయనుంది. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 118 స్థానాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఈ 118 స్థానాల్లో టీడీపీ 94 స్థానాలకు పోటీ చేయనుంది. అయితే, మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయిదు స్థానాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ మాటలను బట్టి జనసేన మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లకు పరిమితమవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ స్థానాలకు పోటీ చేసే బదులు పోటీ చేస్తున్న స్థానాలను గెలుచుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. దీన్నిబట్టి తదుపరి జాబితాల్లో జనసేనకు కేటాయించే స్థానాలు ఉండకపోవచ్చునని అర్థమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ మరో మాట అన్నారు. తమ పార్టీ మూడు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తోందని, వాటిలోని అసెంబ్లీ స్థానాలను లెక్క వేసుకుంటే మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లవుతుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి చూస్తే పవన్ కల్యాణ్ తిక్కకు కూడా ఓ లెక్క ఉన్నట్లే అనిపిస్తోంది.
అదే సమయంలో కాపు నేత హరిరామ జోగయ్యకు పవన్ కల్యాణ్ ఆ విధంగా సమాధానం ఇచ్చారని కూడా అనుకోవచ్చు. జనసేన 40కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని హరిరామ జోగయ్య అంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ చెప్పిన లెక్క ప్రకారం హరిరామ జోగయ్య డిమాండ్ నెరవేర్చినట్లే అనుకోవాలి.