పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. పవన్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆయన మండిపడ్డారు. తిరువూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేనలో పవన్ వెనుక తిరిగినవారు రాజ్యాధికారం కోరుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇల్లూ వాకిళ్లు కోల్పోయినవారి పరిస్థితి ఏంటని నిలదీశారు. 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని ఆయన మండిపడ్డారు.
కాపులకు రాజ్యాధికారి జగన్ వల్లే దక్కింది..
కాపులు కోరుకున్న రాజ్యాధికారం జగన్ వల్లే దక్కిందని అడపా శేషు చెప్పారు. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 30 మంది కాపులను ఎమ్మెల్యేలను చేశారని గుర్తుచేశారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందని చెప్పారు. కాపులకు జగన్ ఏం చేయలేదని ఆయన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా అడపా శేషు ప్రశ్నించారు. చెప్పాడంటే చేస్తాడంతే.. అదే జగన్మోహన్రెడ్డి.. అని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా కాపులకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని వివరించారు.
మళ్లీ టీడీపీకి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయ్..
మళ్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని అడపా శేషు చెప్పారు. మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయని హెచ్చరించారు. కాపులకు రాజకీయ గురువు రంగా ఒక్కరేనని.. చిరంజీవి, పవన్ కేవలం సినిమా హీరోలు మాత్రమేనని ఆయన చెప్పారు. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు ఆయన్ని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.