కొన్ని రోజుల కిందటి వరకు జనసేనను టార్గెట్ చేస్తూ వరుసగా లేఖాస్త్రాలు వదిలిన కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య కొద్దిరోజులుగా కాస్త చల్లబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి లేఖ వదిలారు. కూటమి మేనిఫెస్టోపై ప్రశ్నలు సంధించారు. కాపు రిజర్వేషన్ల ప్రస్తావన లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల ప్రస్తావన లేకపోవడంపై హరిరామ జోగయ్య ప్రశ్నించారు. ఈ విషయమై కూటమి పార్టీ నేతలకు ఘాటు లేఖ రాశారు. వెనకబడిన కాపు కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టకుండా ఆ సామాజిక వర్గాన్ని మోసం చేయాలని భావిస్తున్నారా? అని ఆయన కూటమి నాయకుల్ని ప్రశ్నించారు.
కాపులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంపై మేనిఫెస్టోలో ఎందుకు చోటు కల్పించలేకపోయారని నిలదీశారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారని కాపులు ఎదురుచూస్తున్నారని.. ఈ తరుణంలో ఆ అంశాన్ని కూటమి పట్టించుకోలేదని విమర్శించారు. కాపుల రిజర్వేషన్ల అంశం మేనిఫెస్టోలో ప్రస్తావించకపోవడానికి గల కారణాలు చెప్పాలంటూ హరిరామయ్య జోగయ్య తాను రాసిన లేఖలో ప్రశ్నించారు.
కొద్ది రోజుల కిందటి వరకు టీడీపీతో పొత్తు, తీసుకోవాల్సిన సీట్ల సంఖ్య, పోటీ చేయాల్సిన అభ్యర్థులు వీరే అంటూ వరుసగా జోగయ్య జనసేనకు లేఖలు రాశారు. జనసేన కేవలం 21 స్థానాలకు పరిమితం కావడం పైన కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే జోగయ్య తనయుడు వైసీపీలో చేరడంతో జనసేనను విమర్శించే అర్హత జోగయ్యకు లేదని ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న జోగయ్య కూటమి మేనిఫెస్టో విడుదల చేయడంతో మరోసారి స్పందించారు. కూటమిని టార్గెట్ చేసి జోగయ్య లేఖ విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.