అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీసం హైదరాబాద్లో శాంతిభద్రతలు కట్టడి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గూండాలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్నారు. అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ దగ్గర ఇప్పటికే 10 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు కేటీఆర్. ఈ విషయంపై స్పీకర్ త్వరగా తేల్చాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం..రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా మొదలుపెట్టారన్నారు కేటీఆర్. చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి తలకుమాసిన ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చి పోయారన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రులుగా పెద్ద పేరున్న వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్యలతో కొట్లాడమని, వాళ్లతో పోలిస్తే రేవంత్ చాలా చిన్నోడు, చిట్టి నాయుడు అంటూ సెటైర్ వేశారు. రేవంత్ లాంటి బుల్లబ్బాయ్, చిట్టినాయుడులను చాలా మందిని చూశామన్నారు కేటీఆర్.
గడిచిన పదేళ్లలో తెలంగాణలో ప్రాంతీయ విబేధాలను చూడలేదన్నారు కేటీఆర్. ఆంధ్రా, తెలంగాణ పంచాయతీలు ఎక్కడా జరగలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టి పాలన నడిపించామన్నారు కేటీఆర్. కానీ రేవంత్ వచ్చాక ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అవి చెల్లవన్నారు. హైదరాబాద్ ప్రజలంతా ఇక్కడి వారేనన్నారు కేటీఆర్. భవిష్యత్లోనూ ప్రాంతీయ విబేధాలు రావన్నారు. రేవంత్ డైవర్షన్ గేమ్స్ ఎన్ని ఆడినా ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్.