ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల రణరంగానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాయి. అందులో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను గతంలో విమర్శించిన చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే అదే పథకాలను కొనసాగిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు ఇలా చెబుతున్నారంటే ఆ పథకాలు ప్రజలకు ఎంత మేలు చేశాయో అర్థమవుతుందని అన్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో అమలు చేస్తున్న పథకాలను తిరిగి ఇస్తానని చెప్పడం తన రాజకీయ జీవితానికే సిగ్గుచేటని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల ద్వారా కాకుండా జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటింటికి అందిస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు దమ్ముంటే తిరిగి తాను జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. గతంలో వలంటీర్ గురించి చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ఎంతగా విమర్శించారో ప్రజలు ఎవరూ మర్చిపోలేదని తెలిపారు. ఇక నోరు తెరిస్తే చంద్రబాబు అబద్ధాలు చెబుతారని, గత ఎన్నికలలో ఇచ్చిన 600 హామీలను ఆయన మర్చిపోయారని తెలిపారు. ఇక జూన్ నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంటే ఈయన ఏప్రిల్లోనే 4000 పెన్షన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు నిబద్ధత ఆయన మాటలలో నిజం ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుందని కురసాల కన్నబాబు విమర్శలు చేశారు.