రాజకీయంగా ఎదిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కృషి చేస్తున్నారు. ఏపీలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఒంటరిగా పోటీ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆయన టీడీపీతో కలిసి పోటీకి దిగుతున్నారు. మొదటి నుంచి బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. కాబట్టి.. ఈ రెండు పార్టీలతో కలిసి బరిలోకి దిగితే అసెంబ్లీలోకి అడుగుపెట్టొచ్చని పవన్ అనుకుంటున్నారు. కానీ.. టీడీపీ మాయలో పడి పవన్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నాడనే వాదన ఎక్కువగా వినపడుతోంది.
టీడీపీని దూరం పెట్టి…కేవలం బీజేపీతో ఆయన బరిలోకి దిగి ఉంటే మంచి అవకాశం వచ్చి ఉండేది. అలా వర్కౌట్ అయ్యేలా బీజేపీ మంచి ప్లాన్ కూడా వేసిందట. ఆంధ్రప్రదేశ్లో బిజెపి ప్లాన్ గురించి వివరిస్తూ అది తనకు ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారమంటూ ఓ పొలిటికల్ క్రిటిక్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఆ పొలిటికల్ క్రిటిక్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని వెనక్కి నెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్కు ప్రధాన పోటీదారుగా జనసేనతో కలిసి తమ పార్టీని నిలబెట్టాలని బిజెపి నాయకులు ప్లాన్ చేశారు, అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను బిజెపి నేతలు పవన్ కల్యాణ్కు కూడా చేరవేశారు. పవన్ కల్యాణ్కు చెందిన జనసేనకు 125 ఎమ్యెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని, పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుపెట్టాలని బిజెపి భావించింది. రైల్వే జోన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, చిరంజీవికి రాజ్యసభ సీటు హామీలను కూడా పవన్ కల్యాణ్కు ఇచ్చింది.
అయితే, పవన్ మాత్రం రాష్ట్రంలో బీజేపీ మరీ అంత బలంగా లేకపోవడంతో.. ఆ ప్లాన్కి ఒకే చెప్పలేకపోయాడు. అంతేకాకుండా.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ బిజెపిపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. దీంతో.. బీజేపీ కూడా చేసేది లేక.. పవన్ చెప్పినదానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అలా కాకుండా.. బిజెపి చెప్పినట్లుగా పవన్ ఒంటరిగా.. టీడీపీతో సంబంధం లేకుండా అడుగులు వేసి ఉండి ఉంటే.. ఈ ఎన్నికలకు కాకపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా పార్టీని మార్చుకునేవారు. అప్పుడైనా సీఎంగా గెలిచే అవకాశాలు ఉండి ఉండేవి. నిజానికి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు మరింత క్షీణిస్తారు. అక్కడ బలమైన నేతలేక.. అందరూ జనసేనకు చేరేవారు. అప్పుడు.. పవన్ని సీఎంగా చూడాలన్న అభిమానుల కోరిక కూడా తీరేది. కానీ.. పవన్ మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటూ.. టీడీపీ వెంట నడవడానికి అంగీకరించడం గమనార్హం.