ఇల్తిజా ముఫ్తీ… తాజాగా రాజకీయరంగంలో అడుగుపెట్టింది. కశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇల్తిజా ముఫ్తీ ఆ కుటుంబంలో మూడవతరం రాజకీయ వారసురాలు. ఆమె తల్లి మెహబూబా ముఫ్తి ఆ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఆమె తాత ముఫ్తి మహమ్మద్ సయ్యద్ పీడీపీ ఫౌండర్, కేంద్ర మాజీ మంత్రి కూడా. ఇల్తిజా ఇప్పుడు బిజ్మెహరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కశ్మీర్ అసెంబ్లీ బరిలో ఉంది. తాజా ఎంట్రీ కాబట్టి ఇల్తిజా ముఫ్తీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. కానీ… ఉత్తరాదిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్. ఒడిశాలో నవీన్ పట్నాయక్, దక్షిణాదికి వస్తే కేటీఆర్, స్టాలిన్ కూడా తండ్రులు, తాతలు పరిచిన కార్పెట్ మీద నడుస్తూ వారసత్వంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన వాళ్లే.
తాజా పార్లమెంట్ లెక్కలిలా!
2024 లోక్సభ ఎన్నికలయ్యాయి. అందులో స్వయంకృషితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు 20 శాతం (108) మాత్రమే. 32 శాతం (173 మంది) రాజకీయ కుటుంబాల నుంచి వారసత్వంగా వచ్చిన వాళ్లు. మరికొంత వివరంగా వర్గీకరిస్తే… వారిలో 21 శాతం తొలితరం వారసులు… అంటే తండ్రి నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాళ్లు. 72 శాతం రెండవ తరం వారసులు… తాత నుంచి తండ్రి, ఆ తర్వాత మనుమలు లేదా మనుమరాళ్లు. ఆరుశాతం మాత్రం అంతకంటే ఎక్కువ తరాల నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకుంటూ వస్తున్న రాజకీయ కుటుంబాల వారసులు.
ఇక్కడా వారసత్వమే!
మహిళల విషయానికి వస్తే… 18వ లోక్సభలో 74 మంది సభ్యులున్నారు. వారిలో 63.5 శాతం రాజకీయ కుటుంబాల వాళ్లే. మొత్తం పార్లమెంట్లో ఉన్న మహిళల గణన చూస్తే 86.5 శాతం చాలా గట్టి కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్లే. రాజకీయంగా లేదా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న వాళ్లు. ఈ అధ్యయనాన్ని గమనిస్తుంటే బాలీవుడ్ మదిలో మెదలుతూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ నటీనటులను గమనిస్తే స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చే వారసులకు కార్పెట్ సిద్ధంగా ఉంటుంది. బాలీవుడ్లో నెపోటిజమ్ మీద విస్తృతంగా వచ్చిన కథనాలు, మరణాలే ఇందుకు సాక్ష్యం. బాక్సాఫీసే కాదు, బ్యాలట్ బాక్స్ కూడా వారసత్వాన్ని మోస్తూనే ఉంది.