ఏ పని చేసిన తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని, తానో విజనరీనని చంద్రబాబు చెప్పుకుంటారు. ఇక పచ్చమీడియా సైతం ఆయనకు వంత పాడుతుంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసింది తానొక్కడినేనని చంద్రబాబు తరచూ చెప్పుకుంటారు. అందులో నిజం లేకపోలేదు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో
జగన్ చేతిలో తెలుగుదేశం ఓడినప్పుడు ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది. అదేంటంటే..చంద్రబాబు ఓ అరుదైన ఘనత సాధించారని ఆ వార్త సారాంశం. వైఎస్సార్, జగన్ మోహన్ రెడ్డిల చేతిలో ఓడిపోయిన చంద్రబాబును కీర్తిస్తూ ఆ వార్తను రాశారు. తండ్రి, కొడుకులకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్న ఏకైక నేత చంద్రబాబు అంటూ గొప్పగా ఆ వార్త రాసుకొచ్చారు.
అయితే చంద్రబాబు మరో రికార్డును ఆయన సొంతం చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే అత్యంత ఎక్కువకాలం ప్రతిపక్షంలో ఉన్న నేతగా చంద్రబాబు రికార్డులకెక్కనున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగా..15 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే..మరో ఐదేళ్లు ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే. మొత్తంగా ఆయన 20 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి రికార్డులకెక్కనున్నారన్న మాట.