ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద కష్టాల్లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి మౌనం దాల్చారని, అలాంటి నాయకుడికి ప్రతిపక్ష నేత అనే హోదా ఎందుకని సూటిగా ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని, మౌనం వీడటం లేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఫ్రెండ్స్ తో కలసి అమెరికా వెళ్లిన కేటీఆర్ అక్కడ ఎంజాయ్ చేస్తూ.. ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం దారుణం అన్నారు సీఎం. తెలంగాణలోనే లేని కేటీఆర్.. ఖమ్మం జిల్లాలో మంత్రులు లేరని అనడం సరికాదన్నారు. అమెరికాలో ఉండి, పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కేటీఆర్, మంత్రుల్ని బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు రేవంత్ రెడ్డి.
https://x.com/revanth_anumula/status/1830605589694603463
వరదల్లో రాజకీయాలేంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి పనిచేస్తూ ప్రజల కష్టాలు తీర్చాలన్నారు. తెలంగాణతోపాటు ఏపీ కూడా తీవ్రంగా నష్టపోయిందని గత 60, 70 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షాలు, వరదలను ఎవరూ చూడలేదని చెప్పారు. ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, అత్యధిక వర్షపాతంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలని తాను ప్రధానికి లేఖ రాశానన్నారు. తక్షణ సాయం కోరానని, ఏరియల్ సర్వేకోసం తెలంగాణకు రావాలని కోరానన్నారు రేవంత్ రెడ్డి.
https://x.com/revanth_anumula/status/1830826749103378502
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో బాధితుల్ని పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారితో మాట్లాడారు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. రాత్రికి ఖమ్మంలోనే బస చేసిన ఆయన, ఈరోజు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ప్రజల కష్టంలో తోడుగా, వారి కన్నీళ్లలో అండగా ఉన్నామంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి. వరద బాధితులను నేరుగా కలిసి, ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశామన్నారు. వరద బాధితులకు తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేలు అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.