వలంటీర్ల వ్యవస్థపై కుట్రతో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్వార్థంతో ఆయన ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. స్వార్థంతోనే వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. వలంటీర్లను తప్పించాలని నిమ్మగడ్డ రమేశ్తో ఫిర్యాదు చేయించింది చంద్రబాబే అని సజ్జల తెలిపారు.
పెన్షన్ల విషయంలో వాళ్లపై ప్రజాగ్రహం వస్తోందని టీడీపీ గుర్తించిందని.. కానీ చంద్రబాబు ఎంత సంజాయిషీ ఇచ్చినా జనం నమ్మరని సజ్జల అన్నారు. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని.. కానీ ఇప్పటివరకు 60 శాతం పెన్షన్ల పంపిణీ మాత్రమే జరిగిందన్నారు. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వలంటీర్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు సమాజంలో ఉండే అర్హత లేదన్నారు సజ్జల.
ప్రధాని సభ వైఫల్యాన్ని చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారన్నారు సజ్జల. 20 మంది ఎస్పీలపై పురందేశ్వరి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో… షర్మిల ఏపీకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో జనానికే అర్థం కావడం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.