ఇటీవలే యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టాలను చవిచూసిన చైనా.. తాజాగా బెబింకా తుపానుతో వణికిపోతోంది. 75 సంవత్సరాల తర్వాత ఈ తుపాను షాంఘై నగరాన్ని తాకడం గమనార్హం. 1949లో టైపూన్ గ్లోరియా తర్వాత షాంఘైని తాకిన తీవ్ర తుపాను ఇదే. సోమవారం ఉదయం చైనా ఆర్థిక నగరమైన షాంఘైని తాకిన ఈ తుపాను అతి బీభత్సంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది.
గంటకు 151 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులతో నగరం వణికిపోతోంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించాల్సిన 1400 విమానాలు రద్దయ్యాయి. 570 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్ 3 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రానికి ఇది మరింత తీవ్రమవుతుందని అధికారులు ప్రకటించారు.