ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ఇప్పటికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పలు సర్వేలు కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఈసారి ఎన్నికలలో విజయం ఎవరిదనే విషయాలను తేల్చి చెబుతున్నాయి. తాజాగా శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ చేసిన చేసిన సర్వేలో భాగంగా ఈసారి కూటమికి ఎదురు దెబ్బ తప్పదని, మరోసారి వైసీపీదే విజయం అని తెలియజేసింది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి 48.5 శాతం ఓట్లు వస్తాయని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వేలో తేలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.5 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు రాగా, మిగిలిన 2 శాతం మంది ఎటు వేయాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది.
ఇక ఈ సర్వే ప్రకారం 175 స్థానాలలో వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వస్తాయని తెలిపింది.
జిల్లాలవారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా వైసీపీకి 5, కూటమికి 2 మిగిలిన 3 స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలుండగా వైసీపీకి 6 సీట్లు, కూటమికి 2 సీట్లు వస్తాయి. ఒక్క స్థానాంలో పోటాపోటీ ఉంది. విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలు ఉండగా 6 స్థానాలు వైసీపీ, 5 స్థానాలు కూటమి గెలుచుకుంటాయి. 4 సీట్లలో పోటాపోటీ ఉంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా 8 స్థానాలు వైసీపీకి, 7 స్థానాలు కూటమికి వస్తాయి. 4 చోట్ల రెండు పార్టీలకు గట్టి పోటీ ఉండబోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉండగా, వైసీపీకి 7 సీట్లు, కూటమికి 4 స్థానాలు వస్తాయి. 4 స్థానాల్లో భారీ పోటీ ఏర్పడబోతోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాలు వైసీపికి, 5 స్థానాలు కూటమికి వస్తాయి, 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా వైసీపీకి 8 స్థానాలు, కూటమికి 5 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో పోటాపోటీ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా 6 సీట్లు వైసీపీ, 5 సీట్లు కూటమి గెలుచుకుంటాయి. మిగిలిన ఒక స్థానంలో పోటీ ఉంది. నెల్లూరు జిల్లాలో 10 సీట్లుండగా, వైసీపీ 4, కూటమి 3 సీట్లు గెలుచుకుంటాయి. 3 చోట్ల హోరాహోరీ పోరు సాగుతోంది.
ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లుండగా, 8 సీట్లు వైసీపీకి, ఒక్క సీటు కూటమికి వస్తాయి. ఒక్క స్థానంలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలుండగా, వైసీపీకి 10, కూటమికి 3 స్థానాలు వస్తాయి. ఒక్క స్థానంలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలుండగా 7 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 14 కాగా, వీటిలో 10 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటాయి. ఒక్క చోట నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది.