ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ తనదైన రాజకీయాలను మొదలుపెట్టింది. వలంటీర్ల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఇటీవల వైసీపీకి మద్దతుగా రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో కొంతమంది యువకులను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది.
చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలా మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఇదే అదునుగా కొందరు టీడీపీ నేతలు అధికారంలోకి వస్తే మిమ్మల్నే వలంటీర్లుగా నియమిస్తామని కొందరు యువకులను నమ్మబలికారు. వారికి వలంటీర్ల సేవలపై శిక్షణ కూడా ఇచ్చారు. 50 ఇళ్లకు ఒక్కరి చొప్పున పంపించారు.
వాళ్లు ఆ ఇళ్లకు వెళ్లి మేము వలంటీర్లం.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే అన్ని పథకాలు ఆగిపోతాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ కరపత్రాలు చూపించి పెన్షన్లు, ఇంటి స్థలం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పేదల అవసరాలను గుర్తించి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే కొత్త వలంటీర్ల తీరుపై అనుమానం రావడంతో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు స్థానిక నేతలు. వలంటీర్లమంటూ కొత్త వారు వస్తే నమ్మొద్దని సూచిస్తున్నారు.