ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు IPS అధికారుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ సస్పెన్షన్ ఫైల్ పై సీఎం చంద్రబాబు కూడా సంతకం చేశారు. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో ఈ ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీస్ అధికారులు ఈ కేసులో సస్పెండ్ కాగా, ఇప్పుడు ఏకంగా ముగ్గురు IPSలపై వేటు పడింది.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది ప్రభుత్వం. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్లపై వేటు వేసిన్నట్టు తెలిపింది. ఇదే వ్యవహారంలో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కూడా ఇదివరకే సస్పెండ్ కాగా, వీటికి కొనసాగింపుగా మరో మూడు సస్పెన్షన్లు జరిగాయి.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ముంబై నటి కాదంబరి జెత్వానీ మధ్య ఉన్న వివాదం చివరకు పోలీసుల సస్పెన్షన్ల వరకు వచ్చింది. వారిద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసుగా మారింది. దాన్ని పరిశోధించే క్రమంలో పోలీసులు సదరు నటి కాదంబరిని వేధించారనే ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటనలు జరుగగా, ప్రభుత్వం మారిన తర్వాత కాబందరి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాదంబరి నేరుగా విజయవాడ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ మొదలు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఐదుగురు పోలీసులపై వేటు వేశారు. ఈ కేసు ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది.