తిలుమల లడ్డూ ప్రసాదంపై వివాదం మరింత పెరిగింది. ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లు గా పనిచేసిన నేతలు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. సీఎం మాటలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఆ ఆరోపణలు నమ్మశక్యంగా లేవన్నారు. తాను వేంకటేశ్వరస్వామిని నమ్ముతానని.. అందరూ ఆయన భక్తులేనన్నారు. ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానన్నారు వైవీ. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్రెడ్డి కూడా చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేయడం విశేషం.
ఇక టీడీపీ మాత్రం సాక్ష్యాధారాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ రిపోర్ట్ ని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి బయటపెట్టారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఆ రిపోర్ట్ లో ఉంది. ఈ ఏడాది జులైలో లడ్డూని ల్యాబ్కు పంపగా.. అదే నెల 17న నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకన్న లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించేలా కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తులు సర్వనాశనమైపోతారని ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు.
నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.1000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. గత వైసీపీ ప్రభుత్వం కిలో రూ.320 కే టెండర్లు పిలిచిందని ఆరోపించారు టీడీపీ నేత ఆనం. నలుగురు వ్యక్తులకు టెండర్లు ఇచ్చారని.. నాణ్యతతో కూడిన నెయ్యిని రూ.320కి ఎవరైనా ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై అటు నేషనల్ మీడియాలో కూడా కథనాలు రావడం సంచలనంగా మారింది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.