కేంద్రమంత్రి బండి సంజయ్ మళ్లీ తన మార్క్ ప్రసంగాలు మొదలుపెట్టారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇంతకాలం పెద్దగా రాజకీయ విమర్శలకు పోలేదు. తాజాగా ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సెక్రటేరియట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు బండి సంజయ్. తెలంగాణ సెక్రటేరియట్లోకి బండి సంజయ్ వెళ్లడం ఇదే మొదటిసారి.
సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తాను సెక్రటేరియట్లోకి వెళ్లానని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ డోమ్లు కూల్చుతామన్నారు. మూడు అంతస్తులు డోమ్లే ఉన్నాయని, అధికారులు కూర్చోవడానికి సెక్రటేరియట్లో స్థలం కూడా లేదన్నారు సంజయ్.
సెక్రటేరియట్ ప్రారంభోత్సవ సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు సంజయ్. సెక్రటేరియట్ను ఓ వర్గం వారిని సంతృప్తి పరిచేందుకే నిర్మించారని, సచివాలయ డోమ్లను కూల్చివేసి తెలంగాణ సంప్రదాయంలో నిర్మించిన తర్వాతే లోనికి వెళ్తానని చెప్పారు. తాజాగా మరోసారి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు బండి సంజయ్. తన మాటలకు కట్టుబడి ఉంటానన్నారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ చేస్తున్న నవగ్రహ యాగంపైనా స్పందించారు. కేసీఆర్ మంచి కోసం పూజలు చేయరని, అలా చేస్తే ఆయన కేసీఆర్ కాడంటూ విమర్శలు చేశారు. కేసీఆర్కు రీఎంట్రీ కాదు ఎంట్రీ కూడా లేదన్నారు సంజయ్.