రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి మాట తప్పినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిపై ఎన్నికలకు ముందు ఒకమాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పినట్లు జగన్పై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాజధానిపై తనతో మాట్లాడిన జగన్ ఇక్కడే ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకున్నాం కదా అని తనతో చెప్పినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రతిపాదించారని ఆరోపించారు. రాజధాని ప్రాంత జనాలను జగన్ మోసం చేసినట్లు చెప్పారు.
రాజధాని జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని తాను జగన్ను నిలదీసినట్లు వసంత ఇప్పుడు చెప్పారు. అయితే తనను కొడాలి నాని, అంబటి రాంబాబు బెదిరించారని ఆరోపించారు. జగన్ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తావా అంటూ తనపైన కొడాలి, అంబటి తీవ్రంగా విరుచుకుపడినట్లు గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబునాయుడు, లోకేష్ను తిట్టకపోతే తాను ఎలా నమ్ముతానని జగన్ స్వయంగా తనతోనే అన్నట్లు ఆయన చెప్పారు.
వసంత చెప్పిందంతా బాగానే ఉంది.. కానీ రాజధానిపై జగన్ మాట మార్చినప్పుడు, ప్రజలను మోసం చేసినప్పుడే ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? జనాలను మోసం చేయద్దని తాను చెప్పిన మాట జగన్ విననప్పుడే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి ఉంటే వసంత మాటలకు విలువుండేది. అధికారం అంతా అనుభవించి ఎన్నికలకు ముందు పార్టీలో నుండి బయటకు వచ్చేసి జగన్పైన ఆరోపణలు చేయటంలో అర్థమేలేదు. ఇక చంద్రబాబు, లోకేష్ను తిట్టాలని జగన్ ఒత్తిడి పెట్టినట్లు చెప్పటంలో అర్థంలేదు.
చంద్రబాబు, లోకేష్ను తిడితేనే జగన్ నమ్మేట్లయితే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలను జగన్ నమ్మకూడదు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ పైన అదేపనిగా విరుచుకుపడుతున్న వాళ్ళెవరు లేరు. సందర్భం వచ్చినప్పుడు కొడాలి నాని మాత్రమే ఘాటుగా విమర్శిస్తారు. అంబటి, పెద్దిరెడ్డి, రోజా లాంటి మంత్రులు కూడా సందర్భానుసారంగా మాత్రమే మాట్లాడుతారు. చంద్రబాబు, లోకేష్ ను అదేపనిగా ప్రతిరోజు ఎవరూ తిట్టడంలేదు. వీళ్ళని తిడితేనే టికెట్లని, తిట్టినవాళ్ళకే టికెట్లని జగన్ ప్రకటిస్తే పార్టీలోని కొన్ని వేల మంది రెడీగా ఉంటారు. ఏదేమైనా మొదట్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా త్యాగరాజనే కీర్తి దక్కే అవకాశాన్ని వసంత చేజార్చుకున్నారు.