కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక లక్కీయేనా? ఇప్పుడిదే ప్రశ్న పార్టీలో బాగా నలుగుతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బుట్టా పోటీ చేయటానికి అసలు అవకాశమే లేదు. అలాంటిది తాజాగా విడుదలైన ఆరో జాబితాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్చార్జిగా బుట్టాను ప్రకటించింది. 2014లో కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా కొద్దిరోజుల్లోనే టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో పోటీకి చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వలేదు. దాంతో అలిగిన బుట్టా మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు.
పార్టీలో చేర్చుకున్నారు కాని జగన్ ఎందుకనో అంతకుముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో ఆమె పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఈ సమయంలోనే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనకు జగన్ శ్రీకారం చుట్టారు. తనకు కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని బుట్టా రిక్వెస్టు చేసుకున్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇవ్వదలచుకోని జగన్ ఆ స్థానంలో మాచాని వెంకటేశ్వర్లును ఎంపిచేశారు. మాచాని బీసీ చేనేత సామాజికవర్గానికి చెందిన నేత. మాచానిని ఇన్చార్జిగా ఎందుకు ప్రకటించారంటే బుట్టాకు టికెట్ ఇవ్వటానికి ఎమ్మెల్యే అడ్డుపడ్డారట.
తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని బుట్టాకు మాత్రం ఇచ్చేందుకు లేదని ఎమ్మెల్యే గట్టిగా చెప్పటంతోనే జగన్ కూడా మాచానిని ఎంపిక చేశారని టాక్. అయితే మాచాని ఇన్చార్జి కాగానే పార్టీలో వ్యతిరేకత పెరిగిపోయింది. మాచాని స్థానంలో ఇంకెవరినైనా ప్రకటించాలంటు నేతల నుండి జగన్ పైన బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో నేతలందరి దగ్గర అభిప్రాయాలు తీసుకోవటంతో పాటు మళ్ళీ సర్వే చేయించుకున్నారు.
అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ చివరకు ఎమ్మిగనూరు ఇన్చార్జిగా బుట్టాను ప్రకటించారు. ఎమ్మిగనూరులో చేనేత సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే సామాజికవర్గంకు చెందిన బుట్టా చాలాకాలంగా ఎమ్మిగనూరులో పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాలం కలసిరాక కొంత, తన ఓవర్ యాక్షన్ ఫలితంగా ఎప్పటికప్పుడు టికెట్ చేజారిపోతోంది. ఇంతకాలానికి మొదటి మెట్టుగా ఎమ్మిగనూరు ఇన్చార్జి అయ్యారు. కాబట్టి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యేంత వరకు బుట్టా జాగ్రత్తగా వ్యవహరిస్తే అభ్యర్థిగా పోటీ చేయటం దాదాపు ఖాయమే. ఈ రకంగా చూసుకుంటే బుట్టా లక్కీయనే చెప్పాలి.