వైజాగ్ స్టీల్ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్–3ని ఆపివేయాలనే నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గొంతు కోయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడటంలో చంద్రబాబు ఫెయిలయ్యారని ఆయన విమర్శించారు. ఇది టీడీపీ నాయకత్వ అసమర్థతకు నిదర్శనమని తెలిపారు. గురువారం స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
తెలుగు జాతికి అతి పెద్ద ద్రోహం
వైజాగ్ స్టీల్ప్లాంట్ను మూసివేయడమంటే తెలుగు జాతికి అతి పెద్ద ద్రోహమేనని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టేనని ఆయన తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఆయన మౌనం ఎన్డీయే ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చని వివరించారు. ’విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సాగిన 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్ అని, ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయిందని తెలిపారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహమని విమర్శించారు. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టేనని తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్లో ఎగసిపడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టేనని వివరించారు. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ని కంటికి రెప్పలా కాపాడారని విజయసాయిరెడ్డి తెలిపారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు ఎలుగెత్తి చెప్పారని గుర్తుచేశారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గాని, ఎన్ఎండీసీలో గాని విలీనం చేసి, ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని తెలిపారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణమనడంలో సందేహం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.