గతంలో వైసీపీ హయాంలో సచివాలయాలకు, టిడ్కో బిల్డింగ్ లకు ఆ పార్టీ జెండా రంగుల్ని సూచించేలా రంగులు వేశారంటూ టీడీపీ రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక అంతా పసుపుమయం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా అన్న క్యాంటీన్ల రంగులపై రచ్చ మొదలైంది. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు.
ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం అన్న క్యాంటీన్లే కాకుండా ఇతర అన్ని కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారాయన. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషన్లో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు అన్న క్యాంటీన్లపై వైసీపీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. వాటికి విరాళాలు సేకరిస్తున్నారని, చందాలతో అన్న క్యాంటీన్లు నడుపుతున్నారని అంటున్నారు. పోనీ ఎలాగోలా నడుపుతున్నారు కదా.. వైసీపీ హయాంలో ఆ క్యాంటీన్లు కూడా లేవు కదా అనేది టీడీపీ వాదన. మొత్తమ్మీద అన్న క్యాంటీన్లు అవసరమా, లేదా అనే చర్చ ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పసుపు రంగు అవసరమా కాదా అనే దగ్గరకు వచ్చి ఆగింది.